హైదరాబాద్: తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లక్ష్యమన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను (Fish seeds) విడుదల చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని మత్స్య భవన్లో మత్స్య సహకార సొసైటీల చైర్మన్గా పిట్టల రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మత్స్యకారులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. పూడిపోయి, పిచ్చిమొక్కలతో నిండిన చెరువులను స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ (Mission Kakatiya) ద్వారా పునరుద్ధరించుకున్నామని చెప్పారు. నూతన రిజర్వాయర్ల నిర్మాణంతో నిరంతరం చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
గతంలో చెరువులపై దళారుల పెత్తనం ఉండేదని, మత్స్యకారులకు మేలు చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు పంచాయితీరాజ్ పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్స్యశాఖ పరిధిలోకి బదిలీ చేసి సర్వహక్కులు మత్స్యకారులకు అప్పగించామన్నారు. చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద ఎవరు ఊహించని రీతిలో పెరిగిందని చెప్పారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు ట్రక్లు, ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందించామని వెల్లడించారు. వివిధ రకాల చేపల వంటకాలను అమ్ముకోనేందుకు వీలుగా సంచార విక్రయ వాహనాలను కూడా అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అర్హులైన మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 8న మృగశిరకార్తె సందర్భంగా మొదటి సారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ఫిష్ ఫుడ్ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా వివిధ రకాల చేపల వంటకాలతో స్టాల్స్ ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు. మత్స్యరంగంపై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడంతో ఈ రంగం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తంచేశారు.