కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 : పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో కలిసి మంత్రి పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 140 విడుదల చేసిందని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.