హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరగా ఇవ్వాలని చీఫ్ ఇంజినీర్ల కమిటీని మంత్రుల బృందం ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రులు మహమూద్ అలీ, తలసారి శ్రీనివాస్యాదవ్తో కూడిన బృందం సోమవారం ఎంసీహెచ్చార్డీలో చీఫ్ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యింది. సమావేశానికి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పురోగతిని చర్చించారు. కమిటీకి పలు సూచనలు చేశారు. ఉస్మానియా దవాఖాన శిథిలావస్థకు చేరడం, ప్రస్తుతం ఉన్న భవనాలు అవసరాలను తీర్చలేకపోతుండటంతో దాని స్థానంలో అత్యాధునిక వసతులతో నూతన దవాఖానను నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలో నిర్ణయించారు. వందేండ్ల పురాతన భవనాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో పాత భవనానికి ఇబ్బంది కలుగకుండా, కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త భవనాలను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్ల కమిటీని నియమించగా.. వారు క్షేత్రస్థాయిలో పలుమార్లు పర్యటించారు. అనంతరం ప్రాథమిక నివేదికను రూపొందించి ఇటీవలే ప్రభుత్వానికి అందించారు. త్వరలో సమగ్ర నివేదికను అందించనున్నారు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.
8 మెడికల్ కాలేజీలను అడ్మిషన్లకు సిద్ధం చేయాలి
కొత్తగా నెలకొల్పుతున్న ఎనిమిది వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇన్స్పెక్షన్ ఉన్నందున వైద్య కళాశాలల పనులు వేగంగా పూర్తి చేయాలని, నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్య, రోడ్లు, భవనాల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. కొత్త కాలేజీల నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేశ్రెడ్డి, ఆయా కళాశాలల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
కులవృత్తుల బలోపేతమే లక్ష్యం:ఆర్థిక శాఖమంత్రి హరీశ్రావు
కులవృత్తులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలను చేపట్టిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖమంత్రి హరీశ్రావు తెలిపారు. కులవృత్తులు బలోపేతం అయితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ వంటి అనేక పథకాలను చేపట్టిందని తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పశు సంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పథకాల అమలు తీరుపై ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… కులవృత్తులను ప్రోత్సహించేలా, ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అన్నారు. చేప పిల్లలు, గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాల్లో పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకాలను వేగవంతం చేయడానికి సలహాలు, సూచనలు చేశారు. పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డెయిరీ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేపపిల్లలు, రొయ్యపిల్లల విడుదలపైనా సమీక్షించారు.