హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్మాణంలో అలసత్వానికి తావివ్వొద్దని రోడ్లు, భవనాలశాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రోడ్ల పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఢిల్లీలో నిర్మించతలపెట్టిన తెలంగాణభవన్కు సంబంధించిన భూమి విషయం కొలికి వచ్చిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ల సమక్షంలో ఆదివారం ఎంఓయూ చేసుకోబోతున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో బసంత్నగర్ ఫ్లైఓవర్ను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.
అవసరాన్ని బట్టి నల్లగొండ, హైదరాబాద్లో కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖానను త్వరలోనే అఖిలపక్షంతో కలిసి సందర్శించి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక తయారుచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేందిరబోయి, ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, సీఈలు సతీశ్, మోహన్నాయక్, మధుసూదన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.