నవాబ్పేట, ఏప్రిల్ 11 : కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో గురువారం బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతులకు రేవంత్రెడ్డి ఇస్తామన్న రూ.500 బోనస్, రూ.15 వేల రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పథకాలు అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు కేంద్రంలో అధికారమిస్తే ఉగ్రదాడులు జరుగుతాయని చెప్పారు.