అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై. సతీశ్ రెడ్డి ఆరోపించారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. అందుకే దాని నుంచి మీడియా అటెన్షన్ను తప్పించేందుకే అల్లు అర్జున్ను అరెస్టు చేశారని వివరించారు. కానీ ఎప్పటిలాగే అందులోనూ తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వై.సతీశ్ రెడ్డి అన్నారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4, 5వ తేదీల్లో భద్రత కల్పించాలని థియేటర్ యాజమాన్యం ముందస్తుగానే అనుమతి తీసుకుందని తెలిపారు. సినిమా చూడటానికి అల్లు అర్జున్ వస్తుండటంతో అదనపు భద్రత కల్పించాలని థియేటర్ యాజమాన్యం కోరినట్లు ప్రభుత్వానికి సమర్పించిన లేఖలో స్పష్టంగా ఉందని అన్నారు. రద్దీని అదుపు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నాక రద్దీని అదుపు చేయడంలో ఎవరు బాధ్యత వహించాలో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యం వల్లే రేవతి అనే మహిళ మరణించారని తెలిపారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.