హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పెండింగ్ బిల్లులను వేగంగా చెల్లించడానికి పీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా నేరుగా విక్రేతలకు విడుదల చేస్తారని వివరించారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించారనేది వాస్తవం కాదని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, ఖర్చులపై మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదల చేస్తామన్నారని, ఈ నేపథ్యంలో ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్టు వివరించారు.
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించిందని, వీటిని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నామని హనుమంతరావు తెలిపారు. ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ఆర్థిక సంఘం వాటా, వాటితో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా కలిపి విడుదల చేస్తున్నదని వివరించారు. కేంద్రం సైతం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నదని, నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్ల్లో జమ చేయదని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్టైడ్ కాంపొనెంట్ అనే రెండు రకాలుగా వెచ్చించాల్సి ఉంటుందని, టైడ్ కాంపొనెంట్ను పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించవచ్చని నిబంధనలు చెప్తున్నాయని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీకి అధికారం ఉన్న ఏ ఉద్దేశానికైనా అన్టైడ్ గ్రాంట్ను ఉపయోగించవచ్చని స్పష్టంచేశారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడానికి ముందు గ్రామ పంచాయతీలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట ఖర్చులను రికార్డు చేశాయని పేర్కొన్నారు.