వేల్పూర్, మార్చి 6: మహిళా కేంద్రంగానే కేసీఆర్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, వారికి కావాల్సింది ప్రోత్సాహం మాత్రమేనని తెలిపారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో సోమవారం నిర్వహించిన వేడుకలకు మంత్రి తన సతీమణి నీరజారెడ్డితో హాజరయ్యారు.
బాల్కొండ నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, వీవోలు, సీసీలు, ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లకు ఆయన చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారని చెప్పారు. మహిళా సాధికారత కోసం కేసీఆర్లా ప్రపంచంలోనే మరెవరూ ఆలోచన చేయలేదని స్పష్టం చేశారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసీఆర్ కిట్తో మొదలు వృద్ధాప్యంలో ఆసరా పెన్షన్ వరకు ఎన్నో మానవీయ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలవుతున్నాయని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.