బషీరాబాద్, ఫిబ్రవరి 2 : సన్న బియ్యం పంపిణీ పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల పర్యవేక్షణలోపంతో నాణ్యమైన బియ్యం సరఫరా కావడం లేదు. బూజు, పురుగులతో కూడిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక 50 కిలోల బ స్తాలో రెండు, మూడు కిలోల తరుగు వస్తుందని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో జనవరి నెల కోటా కింద సరఫరా చేసిన బియ్యం బస్తాల్లో చాలా వర కు పురుగులు, బూజుతో కూడిన నాణ్యత లేని బియ్యం ఉన్నాయని లబ్ధిదారులు వాపోయారు. ఇదే విషయాన్ని డీలర్ ప్రభాకర్ను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ మాట వినడం లేదని పేర్కొన్నారు. జనవరి నెలలో వచ్చిన కోటా మిగిలిపోవడంతో ఈ నెల లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.