హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్, ఆయుర్వేద ట్రస్ట్ (స్మార్దా) అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో స్మార్దా ఆధ్వర్యాన 152 మంది గురుకులాల విద్యార్థులకు ఆయన ల్యాప్టాప్లు పంపిణీ చేశారు.
మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ శరత్ అద్దంకి విదేశాల్లో స్థిరపడి స్మార్దా పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తూ ‘అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం’ అనే కార్యక్రమం చేపడుతుండటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా ట్రస్ట్ సేవలు అందిస్తూ, ఎంతో మంది పేద పిల్లలకు మేలు చేస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ సేవలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.