ఖమ్మం/ఖమ్మం సిటీ, ఆగస్టు 29: మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. మున్నే రు వరద బాధితులకు ఐటీసీ సంస్థ అందించిన రూ.కోటి విలువైన గృహ వినియోగ వస్తువులను ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముంపు బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మున్నేరు సమస్యను సీఎం కేసీఆర్కు విన్నవించగా రూ.150 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మున్నేరుపై కొత్త వంతెన నిర్మాణాన్ని రూ.180 కోట్లతో చేపట్టనున్నట్టు తెలిపారు. ముంపు బాధితుల కోసం ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ తన తాత సంస్థ నుంచి రూ.50 లక్షలు అందించారని గుర్తుచేశారు. ఈ మొత్తాన్ని కలెక్టర్ ఖాతాలో జమ చేశామని, ముంపులో గృహాలు దెబ్బతిన్న వారికి ఈ నగదును అందజేయనున్నట్టు తెలిపారు.