సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రజక, నాయీ బ్రాహ్మణ కుల వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో 161 మంది రజక, నాయీ బ్రాహ్మణ లబ్దిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉచిత విద్యుత్ మీటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచన చేయని విధంగా కుల వృత్తిదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఉచిత విద్యుత్ నిర్ణయంతో బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం మరోసారి నిరూపించారన్నారు. కుల వృత్తులకు రాయితీలు కల్పించి ప్రోత్సహించడం అనేది గొప్ప విషయమన్నారు. ఇది దేశంలో కేసీఆర్కు తప్పా మరెవరికీ సాధ్యం కాదన్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ మీటర్లు అందుకున్న వారందరికి, అందుకోబోయే లబ్దిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, వైస్ ఛైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ పెరుమాళ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.