హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో 2,91,057 ఇండ్లను మంజూరు చేయగా, అందులో 1,29,528 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. మరో 58,350 ఇండ్ల నిర్మాణం తుదిదశకు చేరుకోగా, మిగిలిన 40,651 ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశలో ఉన్నాయని వివరించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై బుధవారం మంత్రి వేముల మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,614.95 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదల కోసం రూ.19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో 2,91,057 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసినట్టు, ఇందులో 2,28,529 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మీడియా అకాడమీ భవనాన్ని డిసెంబర్ చివరికల్లా పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) గణపతిరెడ్డిని ఆదేశించారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి మీడియా అకాడమీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్థూపం, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహంతోపాటు మీడియా అకాడమీ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేలా చూడాలని అల్లం నారాయణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.