కల్లూరు, అక్టోబర్ 2 : రాష్ట్రంలో పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పశువుల కొట్టాలకు బిల్లులు మంజూరు చేసి.. దళారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత ఆ పార్టీదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రవికుమార్ అధ్యక్షతన 31 పంచాయతీలకు.. గృహలక్ష్మి పథకం కింద 600 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా మిగిలి ఉన్న 150 ఇళ్లకు మంజూరు పత్రాలు ఇచ్చే హామీ తనదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం మహిళల ఆత్మగౌరవం కోసమేనని అన్నారు.
నిరుపేదలను మోసం చేసేందుకు అబద్దాలు చెబుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని అన్నారు. చింతకాని, కొత్తకారాయిగూడెం మండలాల్లో దళితబంధును నూటికి నూరుశాతం ఎలా అమలు చేశామో.. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇచ్చే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడెవరో తెలియదు? 11 ఏళ్లు ఏలి రూ.50లకు మించి పింఛన్ ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు దళితబంధు ఇవ్వలేదు? ఎందుకు రూ.4వేలు పింఛన్ ఇవ్వలేదు? రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పథకాలను ఎందుకు ఇవ్వలేదు? నేడు మేమిస్తామని ప్రగల్భాలు పలుకుతూ గ్రామాల్లో తిరుగుతూ జనాలను మోసం చేస్తున్నారని, వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని అన్నారు.
సాధారణ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి నిత్యం ప్రజలతోనే ఉంటున్న నేను కావాలా.. ఎన్నికల సమయంలో కనబడి మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు రాని నాయకులు కావాలో.. తేల్చుకోవాలని ప్రజలను కోరారు. పక్కా ఇళ్లను గతంలో ఎన్టీ.రామారావు, వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచారని, నేడు అదే ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ ముందుంచుతున్నారని తెలిపారు. గృహలక్ష్మి మంజూరైన ప్రతి మహిళ పేరుపై గృహలక్ష్మి ఖాతాలను ప్రారంభించాలని, ఆ నిధులు కేవలం వారి అకౌంట్లలో మాత్రమే జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎస్కె.కమ్లీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.