Booster Dose | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధవారం నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానున్నది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్’ టీకాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం 5 లక్షల డోసులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్గా కార్బెవ్యాక్స్ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం గతంలోనే అనుమతులు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, మన దేశంలోనూ అనేక రాష్ర్టాల్లో కొన్నాళ్లుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బూస్టర్ డోస్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇలాంటి ఆపత్కాలంలో టీకాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కావాలంటే రాష్ర్టాలే స్వయంగా కొనుగోలు చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్’ టీకాలను సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో టీకాలు అందుబాటులో ఉంటాయని ప్రజారోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం పేర్కొన్నారు.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గత నెల రెండో వారం నుంచే కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నది. గత నెల రెండో వారం నుంచే రాష్ర్టానికి కొవిడ్ టీకాలు పంపడం ఆపేసింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గత నెల 17న వైద్యాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేవలం 6 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వయంగా అదే రోజున రాష్ట్రప్రభుత్వం తరుపున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం పెడచెవిన పెట్టింది. దీంతో మార్చి నెలాఖరుకు ఒక డోసు టీకా కూడా లేకుండా పోయింది. అప్పటి నుంచి వ్యాక్సిన్ సరఫరాను ఆపేశారు. టీకాలను పంపిణీ చేసేది లేదని ఈ నెల 7వ తేదీన కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బయోలాజికల్-ఈ సంస్థ నుంచి 15 లక్షల డోసుల కార్బెవ్యాక్స్ టీకాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.