హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు ఈ నెల 24న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ ద్వారా అమలు చేస్తున్న సీఎంఎస్టీఈ, ఎంఎస్ఎంఈ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రూరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్లో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్నాయక్ తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని సేవాలాల్ బంజారా భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి కేటీఆర్ సహా మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ హాజరవుతారని పేర్కొన్నారు.