నమస్తే తెలంగాణ, నెట్వర్క్, సెప్టెంబర్ 23: తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకగా అందిస్తున్న చీరెల పంపిణీ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రజాప్రతినిధులు చీరెలను మహిళలకు అందజేస్తున్నారు. చీరెలు అందుకున్న ఆడబిడ్డలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ను మనసు నిండుగా ఆశీర్వదిస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీగౌడ్, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట, తాండూరు, బెల్లంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని రాంనగర్ మహిళా సంఘం భవనంలో 16, 37, 38 డివిజన్లో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త బట్టలు లేవని బాధపడే ఆడబిడ్డలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కానుకగా ఈ చీరెలను అందిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంతోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడూ ప్రజలు, మహిళల బాగోగులు పట్టించుకోలేదన్నారు.
పూలను పూజిండచం తెలంగాణ సంస్కృతి అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గత ఆరేండ్లుగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరె సారెను పంపుతున్నట్టు గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెలను ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టింటి కానుకగా అందిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తెలంగాణపై కేసీఆర్కు ఉన్న ప్రేమ, తెలంగాణ బాగుండాలనే ఆర్తి సంక్షేమ పథకాల్లో ప్రతిబింబిస్తున్నదని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చాక బతుకమ్మను ఘనంగా జరుపుకొంటున్నామని తెలిపారు. తెలంగాణలో ఆడబిడ్డలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకే బతుకమ్మ కానుకను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నేతకార్మికులకు పని కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ చీరెల తయారీని వారికే అప్పగించినట్టు చెప్పారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిరలో బతుకమ్మ చీరెలను మహిళలకు పంచిపెట్టారు. కాగా, సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెలు అందజేసి పంపిణీ ప్రారంభించారు.