Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇలాంటి పథకం మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం సచివాలయంలోని మంత్రి తలసాని కార్యాలయంలో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో హైదరాబాద్లో 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేశామని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని అభినందించారు.
రెండో విడత పంపిణీని ఈ నెల 21న చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సారి గ్రేటర్ పరిధిలోని 13,300 మంది నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికను కంప్యూటర్ ఆధారిత ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నామని, అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక జరిగేందుకు మీడియా ముందే డ్రా తీస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలుగానీ, ఇతర ఏ ప్రజాప్రతినిధుల ప్రమేయం గానీ లేకుండా పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులకే అప్పగించినట్టు వివరించారు. ఇండ్ల పంపిణీ ప్రక్రియలో తప్పు చేసిన అధికారులను ఉద్యోగం నుంచి తీసివేసే స్థాయిలో కఠినచర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు.
నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 15-20 వేల మందికి లబ్ధి కలగనుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.