హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రతి ఓటరుకు గురువారం కల్లా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిణీ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అమలవుతున్న ‘హోం ఓటింగ్’ విధానంపై సీఈవో వికాస్రాజ్ అధికారులతో సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి తిరిగి ఓటు వేసే హోం ఓటింగ్ విధానాన్ని ఈ నెల 26 కల్లా రాష్ట్రమంతటా పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకొని ఓటు వేయలేని వారికి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం లేదని తెలిపారు. రాష్ట్రంలో 3.26 కోట్ల ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2.20 కోట్ల ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశారని, ప్రతి ఓటరుకు స్లిప్పులు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని బీఎల్వోలకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 40.72 లక్షల ఓటరు కార్డుల ముద్రణ పూర్తయ్యిందని, అర్హులైన వారికి పంపిణీ చేశారని చెప్పారు. మిగిలిన వారికి రెండురోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను అన్నింటిని జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచారని తెలిపారు. మాడల్ పోలింగ్ స్టేషన్లు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా చేయాలని, ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హితమైన, పండుగ వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.