హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రండి.. పార్టీలో చేరండి.. టికెట్లు పుచ్చుకోండి.. బీజేపీలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఏడుగురు జంపింగ్ నేతలే. వారంతా ఇటీవల కాషాయ కండువా కప్పుకొని బీజేపీ నేతలుగా మారారు.
ఆ వెంటనే టికెట్ అందుకుని పోటీకి రెడీ అయ్యారు. దీనినిబట్టి బీజేపీ టికెట్లు అందుకున్న వారిలో సగం మంది ‘గోపి’ (గోడమీద పిల్లి)లేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మిగతా వారిలోనూ ముగ్గురు మాత్రమే ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నారు. అంటే దాదాపు 90 శాతం టికెట్లు పారాచ్యూట్ నేతలకే దక్కాయన్నమాట.
ఇలా చేరి.. అలా టికెట్
బీజేపీ ప్రకటించిన 15 మంది అభ్యర్థులలో బీబీ పాటిల్ (జహీరాబాద్), పీ భరత్ (నాగర్కర్నూల్), శానంపూడి సైదిరెడ్డి(నల్లగొండ), సీతారాంనాయక్ (మహబూబాబాద్), గోడెం నగేశ్ (ఆదిలాబాద్), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి) బీజేపీ కండువా ఇలా కప్పుకొని అలా టికెట్లు పొందినవారే. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత విషయం మరీ ఆశ్చర్యకరం. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచుకున్నారు.
తాను ఆరెస్సెస్ వాదినని ఆమె చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం ఆమెను పారాచ్యూట్ నేతగానే భావిస్తున్నారు. మిగిలిన వరంగల్, ఖమ్మం టికెట్లలో వరంగల్ స్థానం బీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్న అరూరి రమేశ్కు ఖరారైనట్టు తెలిసింది. ఖమ్మం టికెట్ను జలగం వెంకట్రావు ఆశిస్తుండగా, ఆ స్థానం తమకు ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. జలగం అయినా, టీడీపీ అభ్యర్థి అయినా ఇద్దరూ ‘ఇన్స్టంట్’ నేతలేనన్న ప్రచారం జరుగుతున్నది.
వాళ్లను కూడా లెక్కిస్తే..
వాస్తవానికి బీజేపీ సిద్ధాంతాలు పూర్తిగా అర్థమై, దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే సంఘ్ నుంచి వచ్చిన నేతలకో లేదా బీజేపీలో దశాబ్దాల నుంచి పనిచేస్తూ పైకి ఎదిగిన నేతలకో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో మొదటి నుంచీ బీజేపీనే నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నది కిషన్రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మాత్రమే. అర్వింద్ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ అయినా 2018లో ఆయన బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మిగతావారు మాత్రం రెండుమూడేండ్లుగా పార్టీలోకి వచ్చి కొనసాగుతున్నవారే. వీరిలో డీకే అరుణ, రఘునందన్రావు, ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్ వంటివారు ఉన్నారు. పార్టీలో చేరినప్పటికీ వీరంతా ఇప్పటికీ పార్టీలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.
మా పరిస్థితి ఏమిటి?
బీజేపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. బయటి నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు కేటాయిస్తే పరిస్థితి ఏమిటని నేతలు వాపోతున్నారు. ఇన్నాళ్లూ తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగానే ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నల్లగొండ టికెట్ను శానంపూడి సైదిరెడ్డికి ఇవ్వొద్దని జిల్లా నేతలు పలువురు విజ్ఞప్తి చేశారు. టికెట్ ఇవ్వనందుకు మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్రెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు.
సీనియర్ నేత మురళీధర్రావు, మల్క కొమురయ్య, వీరేందర్గౌడ్, సురేశ్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సామ రంగారెడ్డి.. తదితర నేతలంతా టికెట్ ఆశించారు. వీరిలో ఇద్దరుముగ్గురు నేతలు పక్క పార్టీవైపు చూస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ టికెట్ మహిళకు కేటాయించడంపై రాజాసింగ్ మండిపడిన సంగతి తెలిసిందే. మాజీమంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్రెడ్డికి, ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్కు కాకుండా పారాచూట్ నేతకు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు.
నాగర్కర్నూల్ టికెట్ను బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగా రు శ్రుతి ఆశించగా భరత్కు అప్పటికప్పుడు పార్టీ కండువా కప్పి టికెట్ ఇవ్వడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మహబూబ్నగర్ టిక్కెట్ డీకే అరుణకు కేటాయించగానే జితేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మెదక్ నుంచి టికెట్ ఆశించిన అంజిరెడ్డిని పక్కనబెట్టి రఘునందన్రావుకు మరో అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది.