నందిపేట్, సెప్టెంబర్ 12: పాఠశాల సీసీ కెమెరా విషయంలో ముగ్గురు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నూత్పల్లిలో చోటు చేసుకున్నది. నూత్పల్లి గురుకులంలో గాదేపల్లికి చెందిన రుషేంద్ర టెన్త్ చదువుతున్నాడు. శనివా రం వేరే స్కూల్ విద్యార్థి గురుకులంలోని సీసీ కెమెరాకు స్టిక్కర్ అట్టించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రుషేంద్రను గమనించిన పీఈటీ శ్రీకాంత్.. సీసీ కెమెరాను కదిలిస్తుంటే ఏం చేస్తున్నావని కర్రతో తీవ్రంగా కొట్టాడు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు నరేశ్, శంకర్ సైతం దాడిచేశారు. విద్యార్థి వీపుపై దద్దులు, చెవి నుంచి రక్తం రావడంతో రుషేంద్రను దవాఖానకు తీసుకెళ్లారు. విద్యార్థి కుటుంబసభ్యులు సోమవారం స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. విచారణ జరిపిన అధికారులు ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులైన శ్రీకాంత్, శంకర్ను విధుల నుంచి తొలగించారు. నరేశ్పై చర్యలకు నివేదిక పంపించారు. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదుచేశారు.