Telangana Assembly | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదప్రతివాదాలతో సభ కొనసాగింది. విపక్షాల వివరణ, అధికార పక్షం సమాధానం చెప్పకుండానే బుధవారం (ఈ నెల 20) నాటికి వాయిదా పడింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సాయంత్రం వాయిదాపడే వరకు ఉత్కంఠభరితంగా సాగింది.
బీఆర్ఎస్ క్లారిఫికేషన్, అధికార కాంగ్రెస్ సమాధానం లేకుండా సభా సంప్రదాయాలకు భిన్నంగా వాయిదాపడింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తంచేసింది. సభా సంప్రదాయాలను పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం తొలిరోజే ఖూనీ చేసిందని ఆరోపించింది. వ్యక్తిగత విమర్శలకే అధికార పార్టీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చూసినట్టు సభానాయకుడి వ్యవహారశైలి ఉన్నదని బీఆర్ఎస్ ఆక్షేపించింది.
ఉదయం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన చర్చను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీనిపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కే తారక రామారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ప్రసంగించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ సభకు టీ విరామం ఇచ్చారు. 45 నిమిషాల అనంతరం సభ ప్రారంభం కాగానే సభానాయకుడిగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
అనుక్షణం ఉత్కంఠ..
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకలా ఉన్నదని, అసత్యాలు, అభూత కల్పనలతో ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కష్టాలు, తెలంగాణ పల్లెల్లో రక్తపుటేరులు పారించే అప్రజాస్వామిక రాజ్యాన్ని మళ్లీ తెస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యం? అని కేటీఆర్ నిలదీస్తున్న సమయంలో సభలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవటానికి ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. సీఎం కలుగజేసుకొని ఎన్నారైలకు ప్రజాస్వామ్య విలువల గురించి ఏం తెలుస్తాయని, మేనేజ్మెంట్ కోటాలో సభకు వచ్చినవాళ్లకు ఏమీ తెలుసని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని, మాజీ సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ అవకాశం ఇస్తే సింగిల్విండో అధ్యక్షుడిగా ఓడిపోయిన దగ్గరి నుంచి చెప్పుకొచ్చారు.
అలాగే ఎమ్మెల్యే కాకపోయినా హరీశ్రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో హరీశ్రావు అభ్యంతరం చెప్పారు. తెలంగాణ వల్ల, బీఆర్ఎస్ వల్లే కాంగ్రెస్ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విస్మరించకూడదని హరీశ్రావు అన్నారు. హరీశ్రావు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యు లు అడుగడుగునా అడ్డుకున్నారు. వ్యక్తిగత విమర్శలకు, ఆరోపణలకు తావు ఇవ్వకుండా మాట్లాడాలని స్పీకర్ సూచించారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆక్షేపించింది. కాంగ్రెస్కు మిత్రపక్షమైనంత మాత్రాన కూనంనేనిలాంటివాళ్లు వంతపాడాల్సిన అవసరం లేదని తప్పుబట్టింది. టీ విరామం అనంతరం రేవంత్రెడ్డి ప్రసంగించే సమయంలో సభ గందరగోళంగా మారింది. విపక్షంగా తాము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని, మంచిచేస్తే అభినందిస్తామని, హామీ ల నుంచి తప్పుకుంటే ప్రజల పక్షం వహిస్తామని స్పష్టంచేశారు.
నీళ్లు నమిలిన అధికారపక్షం
ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక అధికార పక్షం నీళ్లు నమిలింది. సమాధానాలు వెతకడానికి సభను కాసేపు వాయిదా వేయించుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. విరామ సమయంలో భట్టి, ఇతర మంత్రులు, ప్రభుత్వ శాఖల పెద్దలను హుటాహుటిన తన చాంబర్లోకి పిలిపించుకున్న సీఎం రేవంత్రెడ్డి.. విపక్షాన్ని ఇరుకునపెట్టే వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాకే సభ తిరిగి ప్రారంభమైందన్నట్టు కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ మాదిరిగా సభానాయకుడు మాట్లాడుతున్నారని, కుటుంబపాలన, అవినీతి పాలన అంటూ పేర్కొంటున్నారంటేనే అధికార పక్షం దగ్గర విషయం లేనట్టు అర్థమైపోయిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు.
రగడ…రగడ
సీఎం ప్రసంగంలో మధ్యమధ్యలో వ్యక్తిగత అంశాలు ప్రస్తావించటంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒకదశలో రేవంత్రెడ్డి ‘వాళ్లు వినాల్సిందే.. వాళ్లకు వినటమే సరైన శిక్ష. వాళ్లను బయటికి వెళ్లనీయం’ అని పేర్కొనటంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. అచ్చోసిన ఆంబోతులు అని సీఎం పేర్కొనటాన్ని బీఆర్ఎస్ సభ్యులు తప్పుబట్టారు. మరో సందర్భంలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్రెడ్డి పేర్కొనటంతో ‘అవును సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.
సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆక్షేపణ చెప్పినప్పుడల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరుమూసుకోండి.. కూసోండి.. కూసోండి అంటూ మీదపడ్డారు. ఒకదశలో మంత్రులు భట్టి, శ్రీధర్బాబు, పొన్నం తమ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. సీఎం ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యే హరీశ్రావు పాయింట్ ఆర్డర్ లేవనెత్తారు. సభానాయకుడి ప్రసంగం పూర్తయిన తరువాత అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పటంతో ఆయన ఆగారు. సీఎం ప్రసంగం పూర్తయిన తర్వాత అవకాశం ఇవ్వాలని హరీశ్ పట్టుబట్టారు. అయితే, పార్టీ తరఫున ముందు మాట్లాడిన నాయకుడే (కేటీఆర్) మాట్లాడాలని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తామని మాట ఇచ్చి.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారా?.. సీఎం మాట్లాడిన అంశాలపై క్లారిఫై చెప్పేందుకు తనకు 15 నిమిషాల సమయం ఇవ్వాలని, అలా అయితే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చినట్టు లేదంటే నిరంకుశంగా వ్యవహరించినట్టే’ అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్, మాగంటి గోపీనాథ్ తదితరులు స్పీకర్ వెల్లోకి వెళ్లారు. అంతుకుముందూ మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరుకు నిరసనగా వెల్లోకి దూసుకెళ్లారు. క్లారిఫికేషన్ కోసం తనకు అవకాశం ఇస్తానని ఇవ్వకపోడంతో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు సైతం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనన తెలిపారు.
ఈ సమయంలో మార్షల్స్ రంగ ప్రవేశం చేయటంతో సభలో వాతావరణం అట్టుడికింది. ఈ క్రమంలో క్లారిఫికేషన్కు సమయం ఇవ్వకుండానే స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జై తెలంగాణ.. సేవ్ డెమోక్రసీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున నిరనస తెలిపారు. సభ నుంచే నినాదాలు చేస్తూ మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజే ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేసిందని విరుచుకుపడ్డారు.
ఈ ప్రభుత్వానిదే బాధ్యత !
శాసన సభ, శాసన మండలిలోనూ ప్రసంగం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి పదేపదే తడబడ్డారు. గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. అనేకసార్లు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ క్రమంలో మండలిలో మధుసూదనాచారి కలుగజేసుకుని, ‘మీ ప్రభుత్వానిదే బాధ్యత.. మేమేమైనా కాదన్నామా?’ అనడంతో రేవంత్రెడ్డి నాలుక్కరుచుకున్నారు. ఇక నుంచి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అననని, కేసీఆర్ ప్రభుత్వం అంటానని స్పష్టంచేశారు.