హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ప్రగతిభవన్లో ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులను, నాయకులను ఆహ్వానించనున్నారు. సమావేశం సుదీర్ఘంగా సాగనున్న నేపథ్యంలో ఆహ్వానితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వారితోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజెపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా హాజరు కానున్నారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపుతారు.
సీపీఐ, సీపీఐ(ఎం)లనుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాలని ఇప్పటికే ఆయా పార్టీల కార్యదర్శులు చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్చేసి ఆహ్వానించారు. అదేవిధంగా దళిత సమస్యల పట్ల అవగాహన వుండి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
‘తెలంగాణలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం కూర్చొని మరింత క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.