వరంగల్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అన్న నానుడిని నిజం చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణపై తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతున్నది. కేంద్రం, రాష్ట్రం చెరిసగం నిధులు వెచ్చించి ఆర్వోబీలను నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తున్నది.
దీంతో ప్రజల కష్టాలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రూ.128 కోట్ల నిధులతో ఆర్వోబీలను నిర్మిస్తున్నది. తను ఇవ్వాల్సిన నిధు లు ఇవ్వకపోవడంతోపాటు పనులు జరుగకుండా కొర్రీలు పెడుతుండటం గమనార్హం. కేంద్రం సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమిస్తూ ఉమ్మడి వరంగల్ పరిధిలోని కాజీపేట, హనుమకొండ హంటర్ రోడ్డులోని రైల్వే లైన్లపై చేపట్టిన ఆర్వోబీల నిర్మా ణం పట్టాలపై మినహా దాదాపు పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేశాఖ ఇప్పటికైనా ప్రజల అవసరాలను తీర్చేలా వ్యవహరించాలని, వంతెనల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.