హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం రూపంలో స్థిరంగా రాబడి వస్తున్నది. ముఖ్యంగా గడిచిన ఐదు నెలలుగా నెలవారీ రాబడి రూ.10వేల కోట్ల మార్క్ను దాటుతున్నది. జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ వంటి పన్ను ఆదాయం ఆశించిన మేర వస్తుండటంతో అంచనాలకు తగినట్టుగా ఖజానాకు రాబడి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు సమర్పించిన వివరాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతున్నది. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం తాను విడుదల చేయాల్సిన గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లలో తెలంగాణను ఇబ్బందిపెట్టేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తున్నది.
రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్రం చాలా తక్కువగా గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ నిధులను విడుదల చేస్తున్నది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నది. అక్టోబరులో రూ.85 కోట్ల నిధుల్ని మాత్రమే కేంద్రం గ్రాంటుగా మంజూరు చేయడం గమనార్హం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం స్థిరంగా రావడంతో ప్రగతి కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి.
55 శాతం దాటిన పన్ను ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయంగా సుమారు రూ.1.26 లక్షల కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి ఏడు నెలల్లో రూ.70,126 కోట్లు రాబడి వచ్చింది. అంటే.. లక్ష్యంలో ఇది 55.39 శాతం. 2021-22లో మొదటి ఏడు నెలల్లో 50.7 శాతం మాత్రమే రాబడి వచ్చింది. అంటే, గత ఏడాది కన్నా ఈసారి 4.69శాతం పన్ను రాబడి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో మొత్తంగా రెవెన్యూ రాబడి (పన్ను ఆదాయం + పన్నేతర ఆదాయం + గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి) రూ.84,515.53 కోట్లుగా నమోదైంది. ఇది అంచనాల్లో 43.78 శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఏడునెలల్లో ఇది 35.32 శాతంగా ఉండగా, ఈ ఏడాది 8.46శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఏప్రిల్, మేలో పన్ను ఆదాయం రూ.9వేల కోట్లకుపైగా వచ్చింది. జూన్ నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ప్రతినెలా రూ.10 వేల కోట్లకుపైగా వసూలు అవుతున్నది.
విదిల్చినట్టుగా.. కేంద్రం నిధులు
ప్రగతిశీల రాష్ట్రంగా వేగంగా తెలంగాణ ఎదుగుతుండటం, సీఎం కేసీఆర్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో కేంద్రం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం. అయినా గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాటాగా ఇవ్వాల్సిన నిధులను మాత్రం మోదీ సర్కారు విడుదల చేయడం లేదు. వాస్తవానికి గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ కింద ఈ ఏడాది రూ.41వేల కోట్లు రావాల్సి ఉండగా, తొలి ఏడు నెలల్లో రూ.5,592.66 కోట్ల నిధులు మాత్రమే రాష్ర్టానికి వచ్చాయి. అంటే.. సగంకన్నా ఎక్కువగా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అంచనాల్లో వచ్చింది కేవలం 13.64 శాతం. ఇతర రాష్ర్టాలకు మాత్రం గుజరాత్కు ఏడు నెలల్లో ఏకంగా 79.15 శాతం, కర్ణాటకకు 66.75 శాతం నిధులను కేంద్రం విడుదల చేసి, తన పక్షపాత వైఖరిని మరోమారు చాటుకున్నది.