Vande Bharat express | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంపై అన్ని రంగాల్లోనూ వివక్ష చూపుతున్న కేంద్రలోని బీజేపీ సర్కారు ‘వందే భారత్ రైలు’ విషయంలోనూ కొనసాగిస్తున్నది. కొత్తగా ప్రవేశపెట్టనున్న స్లీపర్కోచ్ వందేభారత్ రైలును అత్యంత డిమాండ్ ఉన్న సికింద్రాబాద్-తిరుపతిని వదిలి ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్నుంచి మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర సర్కారు ఇటీవల వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలున్నా గరిష్ఠంగా 8 గంటలపాటు కూర్చొని ప్రయాణించాల్సిందే. చార్జీలు కూడా విమాన టికెట్లకు సమానంగా ఉన్నాయి. అంత మొత్తం చెల్లించి టికెట్ తీసుకొన్న వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, గర్భిణులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందుల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో కేంద్ర సర్కారు ప్రస్తుతం 8 బోగీలున్న వందే భారత్ రైలుకు మరో 8 బోగీలు జతచేసి స్లీపర్ కోచ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి
వందే భారత్లో స్లీపర్ కోచ్లు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న 530 సీట్లు 1,280కి పెరుగుతాయి. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సౌకర్యంగా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో స్లీపర్ కోచ్లతో వందే భారత్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలుత ఈ తరహా రైళ్లను గుజరాత్నుంచే ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, అత్యంత డిమాండ్ ఉన్న సికింద్రాబాద్-తిరుపతిని వదిలిపెట్టి మోదీ స్వరాష్ట్రంనుంచి రైలును ప్రారంభించేందుకు కేంద్రం యోచన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్-తిరుపతికి శ్రీవారి దర్శనార్థం ఎక్కువమంది వెళ్తారని, ఈ మార్గంలోనే తొలుత స్లీపర్ కోచ్ వందే భారత్ రైలును ప్రారంభించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ రేట్లను మధ్య తరగతికి అందుబాటులో ఉంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.