ఆదిలాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) : పత్తి రైతులకు గిట్టుబాటు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నాణ్యతపేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో అధికారులు పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ.7,020 చొప్పున గిట్టుబాటు ధర కల్పించింది. అక్టోబర్ చివరివారంలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు ప్రస్తుతం చివర దశకు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 21 లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. ఇందులో 17 లక్షల క్వింటాళ్లను 84 వేల మంది రైతుల వద్ద నుంచి సీసీఐ కొనుగోలు చేసింది. కానీ సీసీఐ నాణ్యత పేరుతో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా క్వింటాలుకు రూ.50 తగ్గించి రూ.6,970తో కొనుగోలు చేసింది. ఇంతటితో ఆగకుండా జనవరి 1 నుంచి పంట ధరను ఏకంగా రూ.100 తగ్గించి క్వింటాలుకు రూ.6,920తో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. కానీ ఆదిలాబాద్ మార్కెట్ యార్టులో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.7,550తో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ.530 ఎక్కువగా చెల్లిస్తున్నారు. సీసీఐ రూ.6,920 చెల్లించగా ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.630 అధికంగా చెల్లిస్తున్నారు. దీని వల్ల రైతులు కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ క్వింటాలుకు రూ.100 ధరను తగ్గించగా, అదే పత్తిని ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ ధరతో ఎలా కొనుగోలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట నాణ్యత పేరిట రైతులను నష్టాలకు గురి చేసిన సీసీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.