Congress | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో తమకు అడుగడుగునా అవమానాలకు గురి కావాల్సి వస్తున్నదని బీసీ సామాజిక వర్గ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వీ హనుమంతరావు తదితరులు పార్టీలో అడుగడుగునా అవమానాలను దిగమింగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. టికెట్ల కేటాయింపులో కీలకమైన స్క్రీనింగ్ కమిటీలోనూ బీసీలకు అసలు స్థానమే దక్కలేదు. బీసీ నేతలకు స్థానం కల్పిస్తే తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటారనే ఉద్దేశంతోనే చోటు కల్పించలేదన్న విమర్శలు ఆ సామాజిక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీలోనే కాకుండా పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ తమకు అన్యాయమే జరిగిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వాపోయారు. పార్టీలో నిన్నగాక మొన్న చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానం కల్పించి, తనలాంటి సీనియర్ నాయకుడికి స్థానం కల్పించకుండా అవమానిస్తారా? అంటూ ఆయన రగిలిపోతున్నారు. తనకు కనీస సమాచారం లేకుండానే తన సొంత జిల్లా జనగామ పార్టీ అధ్యక్షునిగా కొమ్మూరి ప్రతాప్రెడ్డిని నియమించడంపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ల విషయంలోనూ…
జనగామ టికెట్ కోసం కొమ్మూరి ప్రతాప్రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. దీని వెనుక రేవంత్హస్తం ఉన్నదంటూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వీ హనుమంతరావు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తనకు ఎసరు పెట్టేందుకు పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయించే కుట్ర జరుగుతున్నదని పొన్నం ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కి ఈసారి నిజామాబాద్ నుంచి కాకుండా ఎల్బీనగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్లో రేవంత్రెడ్డిని మరొకరిని ప్రోత్సహించడం వల్లనే తాను ఎల్బీనగర్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం.