హైదరాబాద్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో పెరుగుతున్న డిమాండ్ మేరకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని, ఆ మొత్తాన్ని సత్వరమే రవాణా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో సంస్థ డైరెక్టర్లు శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బొగ్గు నిల్వ ఉన్న ఏరియాల నుంచి రోడ్డు మార్గం ద్వారా రవాణాను పెంచాలని ఆదేశించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రస్తుతం రోజుకు 14.78 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు తొలగిస్తున్నామని, దానిని 16.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని సూచించారు. గనుల విస్తరణకు సంబంధించిన అనుమతులను వెంటనే సాధించాలని, వానకాలం రాక ముందే నెలవారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమీక్షలో డైరెక్టర్లు బలరామ్, సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్రెడ్డితో పాటు అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, ఈడీ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) సురేశ్, జీఎం (మారెటింగ్) సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.