KTR | హైదరాబాద్ : దేవరకొండ నియోజకవర్గ ప్రజల దశాబ్ద కల అయినటువంటి.. డిండి నీళ్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్.. బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఒక్క దేవరకొండ నియోజకవర్గంలో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రూ. 600 కోట్లతో నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ పనులు పూర్తవుతాయి. డిండి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదు. రాబోయే సంవత్సర కాలంలోనే డిండి నీళ్లు తీసుకొచ్చి దేవరొకండ ప్రజల రుణం తీర్చుకుంటాం. అది మాత్రమే కాదు.. గిరిజన తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం. రైతుబీమా, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలు చేసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. దేవరకొండ నగరపంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం. రోడ్ల నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరు చేశాం. ఇన్ని పనులు మన కండ్ల ముందు కనబడుతుంటే.. సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంటే.. ఇవాళ కాంగ్రెసోళ్లకు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారు. మన వేలితో మన కంటిని పొడుచుకుందామా? ఆలోచించండి. నాడు కరెంట్ లేక రైతులు విలవిలలాడిపోయారు. విద్యుత్ వెలుగులతో ఇవాళ రాష్ట్రం వెలిగిపోతోంది. కరెంట్ కష్టాలు వద్దనుకుంటే కేసీఆర్కు ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు. బీజేపోళ్లేమో రోజుకు ఒకరు వచ్చి ఏదో మాట్లాడి పోతారు. ట్రైబల్ యూనివర్సిటీ పెట్టేందుకు జాగా ఇవ్వలేదని ఒక పెద్దాయన మాట్లాడుతున్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఐదేండ్ల క్రితం 360 ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు నిద్ర లేచి డైలాగులు కొడుతున్నారు. అమిత్ షా ఆదిలాబాద్ వచ్చి రైతు ఆత్మహత్యల్లో తెలంగాణను టాప్ చేశారని అంటున్నారు. బాధ్యత గల మంత్రివి అయితే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయని నీ ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పింది. ఇంత సిగ్గుమాలిన అబద్దాలు ఆడుతున్నారు. బీజేపీకి అబద్దాలు చెప్పడం అలవాటై పోయిందన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని మనం కోరుతున్నాం. మన నాయకుడే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నప్పుడు.. వారికి తొత్తులుగా పని చేసే అవసరం మనకు ఏముందని కేటీఆర్ అడిగారు.