అందమైన స్కూల్ ప్రాంగణాలు, ఆకర్షణీయమైన భవనాలు, అద్భుతమైన ఆటస్థలాలు.. ‘మన ఊరు.. మన బడి’లో మారిన స్కూల్ రూపురేఖలకు సాక్ష్యాలు. కేవలం మౌలిక వసతుల కల్పనకే ఈ కార్యక్రమం పరిమితం కాలేదు. బోధనలో మౌలిక మార్పును తీసుకువచ్చే దిశగా సంస్కరణలను అమలు చేస్తున్నది.
డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు బడిని కేంద్రంగా చేసి విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్కారు బడి మారిన తీరుపై నేటినుంచి 3 రోజులపాటు నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు అందిస్తున్నది.
మంచి విద్య అనేది మెరుగైన భవిష్యత్తుకు పునాది.. సమైక్య పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థను తెలంగాణ సర్కారు మార్చివేసింది. ‘మన ఊరు-మన బడి’ అనే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7,829.55 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పూనుకొన్నది.
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి బంగారు భవితకు బాటలు వేస్తున్నది. పిల్లలు ఆనందంగా.. హుషారుగా విద్యానిలయాలను వచ్చేలా తీర్చిదిద్దుతున్నది. తెలంగాణ సర్కారు బడులను మార్చిన విధానంపై ఈ రోజు నుంచి మీ కోసం మన ‘నమస్తే తెలంగాణ’లో..
-నాగవర్ధన్ రాయల, నమస్తే తెలంగాణ ప్రతినిధి
Digital Classes | జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిండిప్రోలు (ఖమ్మం జిల్లా) తొమ్మిదో తరగతి గదిలో జూలై 14, 2023 మధ్యాహ్నం 2 గంటలకు ఫిజిక్స్ క్లాస్ ప్రారంభమైంది..భౌతిక-రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు పీ శ్యాంప్రసాద్ ‘న్యూటన్ గమన నియమాలు’ పాఠం చెప్తున్నారు. ప్రతీ ‘చర్య’కు సమానమైన ‘ప్రతిచర్య’ ఉంటుందని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు రాకెట్ ప్రయోగాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. ఆ వెంటనే పిల్లలకు ఎదురుగా ‘లాంచ్ వెహికిల్ మార్క్ 3’ని మోసుకుపోయే రాకెట్ రెడీగా ఉంచారు. మధ్యాహ్నం 2.34 గంటలు దాటి 55 సెకన్లు అయింది. ‘ఫైవ్.. ఫోర్.. త్రీ.. టు.. వన్.. స్టార్ట్!’ అంటూ పిల్లలు నిబిడాశ్చర్యంతో కేరింతలు కొడుతున్నారు! ఆ పిల్లల కేరింతల కన్నా వేల రెట్ల వేగంతో రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోతున్నది.
‘శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం తరగతి గదిలోకి ఎట్టొచ్చిందబ్బా?!’ అని ఆశ్చర్యపోకండి. మన బడులు అన్ని రకాల సాంకేతిక హంగులతో పాలపుంత వైపునకు దూసుకుపోయే రాకెట్లాగే కొత్త పుంతలు తొక్కుతున్నాయ్! సతీశ్ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి దూసుకుపోతున్న రాకెట్ గమనాన్ని బెంగళూరులోని అంతరిక్ష భవన్లో ఉన్న శాస్త్రవేత్తలు చూస్తున్నట్టే మన పిల్లలూ ప్రత్యక్షంగా చూడగలిగారు. ఆ అద్భుతమైన చందమామ యాత్ర కన్నా దానిని తరగతిలో ప్రత్యక్షంగా వీక్షించడం అంతకంటే అద్భుతం!
పాఠశాలలే ప్రయోగశాలలు
ఒక్క పిండిప్రోలు పాఠశాలలోనే కాదు.. రాష్ట్రంలోని 2,715 పాఠశాలల్లో ఇలాంటి అద్భుతాలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. ఆ బడుల్లో ఉన్న ‘డిజిటల్ క్లాస్ రూం’లలో ఉపాధ్యాయులు ప్రతి పాఠంపై ఇలాగే ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు కరెంటు వెలుగు కోసం ఎదురుచూసిన తరగతి గదుల్లో ఇప్పుడు స్మార్ట్ బోర్డుపై పాఠాలు చెప్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా వీడియోలు, ైస్లెడ్స్, గ్రాఫ్స్ చూపిస్తూ ప్రత్యక్ష అనుభవం ఆధారంగా బుర్రలోకి ఎక్కిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని ఈ డిజిటల్ క్లాస్ రూంలలో ఎన్నెన్ని హంగులున్నాయో తెలిస్తే విద్యారంగంలో తెలంగాణ ఎంత ముందుందో బోధపడుతుంది.
‘మన ఊరు.. మన బడి’ వైపు ఒకసారి చూడండి. ప్రభుత్వ బడుల్లో సౌలతులు ఉండవన్న సంగతే మర్చిపొతారు. ఇది ఉన్నది, అది లేదనే ముచ్చటే లేదు. అన్నీ ఉన్నాయ్. ఆపై.. కొత్తగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ) వచ్చాయ్! ఇప్పుడిదే ఏ ఊరికి పోయినా చదువుకునే పిల్లలు చెప్పుకొనే ముచ్చట! ‘ఆ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఉన్న బడికే నేబోత’ అని ఊళ్లల్లో పిల్లలు అమ్మనాన్నల మీద అలుగుతున్నారు. ఇది అతిశయోక్తిగా చెప్పిన మాట గాదు. నిజంగా నిజమని చెప్తున్నాడు చల్వాయి జడ్పీ ఉన్నత పాఠశాల (ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం) లో 9వ తరగతి చదువుతున్న గొట్టెముక్కల జశ్వంత్! జశ్వంత్కి ఒక చెల్లి ఉంది. పేరు మేఘన. బాగా చదువుతుంది. మేఘనకు గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో సీటు వచ్చింది. అందులో చేరింది. కానీ, మనసంతా అన్నయ్య చదివే చల్వాయ్ పాఠశాల మీదనే ఉంది. ‘చెల్లె ఐఎఫ్పీ మీద చెప్పే పాఠాలు వినాలనుకున్నది. కానీ, అమ్మానాన్న ఒప్పుకోలే. అయినా, చెల్లె హాస్టల్ నుంచి వచ్చింది. అక్కడి కంటే ఇక్కడే బాగుందని చెప్పి చల్వాయ్ బడికి వచ్చింది. టీసీ ఎక్కడిస్తే అక్కడే సదువాలని సార్లు చెప్పి బడిలోకి రానియ్యకుంటే ఏడ్చింది. ఇంట్ల ఎంత చెప్పినా హాస్టల్కి పోలే. టీసీ తెచ్చి ఈ బడిల చేర్పిస్తమని మావోళ్లు అంటున్నర’ని పాఠాలు మంచిగా చెప్పే బడి మీద చెల్లికి ఎంత ప్రేమో చెప్పిండు జశ్వంత్. ఒక మేఘన మాటే కాదు. తెలంగాణ ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరి మాట!
గజిబిజి లేకుండా గణిత బోధన
పిల్లలు ఇంతగా ఇష్టపడుతున్న ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లలో అద్భుతం ఏముంది? అనడిగితే.. చాలా అద్భుతాలున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఐఎఫ్పీని ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ‘బోర్డు మీద గీతలు గీసి జ్యామితీయ త్రిభుజాలను పిల్లలకు అర్థం చేయించాలంటే ఎంతో కష్టపడాలి. అర్థం చేసుకోవడానికి పిల్లలు కూడా అంతే కష్టపడాలి. కానీ, ఐఎఫ్పీ మీద రంగుల గీతల్లో చూపించడం తేలికగా ఉంది. పిల్లలు అంతే తొందరగా అర్థం చేసుకుంటున్నార’ని ఖమ్మం పట్టణంలోని శాంతినగర్ హైస్కూల్, గణిత ఉపాధ్యాయుడు కే నర్సింహారావు చెప్తున్నారు. పదో తరగతిలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది గణితంలోనే. విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకూ అది ఒక పరీక్షే! ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లలో గణిత శాస్త్రంలోని రేఖాగణిత సమస్యలకు సమాధానం కనుగొనేందుకు కావాల్సిన స్కేల్, వృత్తలేఖిని, కోణమానిని అప్లికేషన్లు ఉంటాయి. అలాగే గ్రిడ్ (పేపర్) ఇందులోనే ఉంటుంది. త్రిభుజాలు, చతురస్రాలు, వృత్తా లు గీయడంతోపాటు రకరకాల రంగులు ఉపయోగిస్తూ పిల్లలను ఆకట్టుకొనేలా, అర్థమయ్యేలా చెప్పొచ్చు. గ్రాఫిక్స్ ద్వారా వివరిస్తుంటే పిల్లలు తేలికగా అర్థం చేసుకొంటున్నారు. చూసి నేర్చుకోవడం వల్ల వాళ్లకు బాగా అర్థమవుతుంది. ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. ఇప్పటి పిల్లల ఆనందం చూస్తుంటే ముచ్చటేస్తుంద’ని ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్ష, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ సీ రామకృష్ణ చెప్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో మూడు డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. మన ఊరు మన బడికి మొదటి విడతలో ఎంపికైన 30 శాతానికి పైగా పాఠశాలల్లో ఇప్పుడు వీటిని ఏర్పాటు చేశారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులనూ ఐఎఫ్పీ మీదనే బోధిస్తున్నారు! ఇప్పటికే ఈ పాఠశాలల్లో ప్రొజెక్టర్స్ ఉన్నా వాటికంటే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయులే కాదు పిల్లలూ వీటిని ఉపయోగిస్తున్నారు. టీచర్ సెలువులో ఉంటే అంతకుముందు చెప్పిన పాఠాన్ని ఓపెన్ చేసి మళ్లీ వింటున్నారు. ఈ తరహా విద్యాబోధన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ‘మద్రాస్ ఐఐటీలో గ్రీన్ బోర్డు మీదే పాఠాలు చెప్తారు. అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి ప్రొజెక్టర్తో స్క్రీన్ మీద ైస్లెడ్స్ చూపించేవాళ్లు. కానీ, డిజిటల్ బోర్డులు ఉపయోగించలేదని’ మద్రాస్ ఐఐటీలో చివరి సంవత్సరం బీటెక్ విద్యార్థి కేఎన్ఏ చతుర్వేది చెప్తున్నారు.
ఆల్ ఇన్ వన్ టెక్నాలజీ!
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు స్మార్ట్ టీవీలా కనిపిస్తుంది. కానీ కంప్యూటర్ కంటే ఎక్కువే పని చేస్తుంది. ఇదున్న క్లాస్లో పాఠాలు చెప్పేందుకు బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డ్ అవసరమే లేదు. ఇది స్మార్ట్ బోర్డ్. దీని డిజిటల్ స్క్రీన్ మీద రాస్తుంటే అక్షరాలు ఏ రంగులో కావాలంటే ఆ రంగులో వస్తుంటాయి. రాతలకు రంగులు మారుస్తూ పోవచ్చు. బోర్డు మీద చెప్పిన పాఠమంతా చెరిపేస్తే చెరిగి పోతుంది. సేవ్ చేస్తే ైస్లెడ్గా ఉండిపోతుంది. రేపటి పాఠం చెప్పే ముందు మళ్లీ గుర్తు చేసేందుకు ఈ ైస్లెడ్ని వాడుకొవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠాన్ని పీడీఎఫ్ రూపంలో స్క్రీన్ మీద చూపిస్తూ పిల్లలకు వివరించవచ్చు. అవసరం రాగానే ఆ పీడీఎఫ్ని మినిమైజ్ చేయవచ్చు. తర్వాత పాఠా న్ని మరింత బాగా అర్థం చేయించేందుకు ఇంటర్నెంట్లో ఫొటోలు, గ్రాఫ్లు, వీడియోలు వెతికి పిల్లలకు చూపించవచ్చు. పాఠం అయిపోయాకా టీచర్ ముందే రాసుకొని తెచ్చిన నోట్స్ని పీడీఎఫ్ రూపంలో ఐఎఫ్పీలో ఓపెన్ చేస్తే విద్యార్థులు అక్షరం తప్పుపోకుండా నోట్స్ రాసుకొంటున్నారు. దీనిని టీవీగా ఉపయోగించుకోవచ్చు. పెన్ డ్రైవ్ ద్వారా వీడియో పాఠాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పిల్లలకు చూపించవచ్చు. ‘నెక్ట్స్ టీచర్’ టూల్ని ఉపయోగించి కూడా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘దీక్ష’ యాప్, టీ శాట్ ద్వారా పాఠాలు చెప్పేందుకు ఈ ఐఎఫ్పీలు ఉపయోగపడుతున్నాయి.
పుటాకార దర్పణం గురించి పిల్లలకు ఇమాజిన్ చేయించడం కష్టంగా ఉండేది. ఐఎఫ్పీ స్క్రీన్ వల్ల యానిమేషన్ వీడియోలు చూపిస్తుంటే పిల్లలకు తేలికగా అర్థమవుతున్నది. రసాయన శాస్త్రంలోని బంధాలను 3డీలో వీడియోల ద్వారా చూపించడం వల్ల ఎలక్ట్రాన్ల మధ్య ఉండే బంధాన్ని బాగా గుర్తు పెట్టుకొంటున్నారు. రసాయన బంధాలు, అణుబంధాలను వివరించడానికి రసాయనాలు, వాటి సంకేతాలు మాత్రమే రాసి చూపిస్తాం. కానీ, వాటి కలయికను, అమరికను చూపించలేం. క్రియాజనకాల నుంచి క్రియా జన్యాల ఏర్పాటుని సంకేత రూపంలో మాత్రమే రాసేది. ఐఎఫ్పీతో ఆ రసాయనాల మధ్య సంయోగం ఎలా జరుగుతున్నదో చూపిస్తున్నాం.
– శ్రీనివాస్, ఫిజికల్ సైన్స్ టీచర్, జడ్పీహెచ్ఎస్, మల్లంపల్లి (ములుగు)
వరల్డ్ క్లాస్ టీచింగ్
పాఠశాలలను ఆకర్షణీయంగా తయారు చేయడంతోపాటు విద్యాబోధనలో ప్రమాణాలను మెరుగుపరిచాం. ఖమ్మం జిల్లాలో 115 పాఠశాలల్లలో డిజిటల్ క్లాస్ రూంలు ఉన్నాయి. మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న డిజిటల్ బోర్డులను అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఉపయోగిస్తున్నారు. పేదలందరికీ మంచి విద్య అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. పేదలు తమ కష్టార్జితాన్ని విద్యకు ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా చేస్తే వాళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. మన ఊరు మన బడి ద్వారా మౌలిక వసతులు, తాగునీళ్లు, మరుగుదొడ్లు అభివృద్ధి చేశాం. పాఠశాలల అభివృద్ధితోపాటు పిల్లల ప్రగతిని సాధించడం ద్వారా మిగతా తల్లిదండ్రుల్ని కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాం.
– ఏటూరి సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం
కావాల్సినంత టైమ్
చెప్పబోయే పాఠానికి సంబంధించిన నోట్స్ను తయారు చేసుకొంటాను. ఆ నోట్స్ పీడీఎఫ్ని ఐపీఎఫ్ స్క్రీన్పై చూపిస్తూ పాఠం చెబుతాను. ఇలా చేయడం వల్ల బోర్డు మీద రాయాల్సిన అవసరం రాదు. ఆ సమయమంతా పిల్లలకు వివరించడానికి వాడుకుంటాను. ఆ రోజు చెప్పిన పాఠాలను ైస్లెడ్స్ రూపంలో సేవ్ చేసుకుంటాను. తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు ప్యానెల్ బ్రౌజర్లోకి పోయి ఇంతకుముందు చెప్పుకున్న పాఠాల ైస్లెడ్స్ ఓపెన్ చేసి వివరిస్తాను. ఆ తర్వాత కొత్త విషయాలు చెప్తూ పోతాను. ఇలా చెప్పడం వల్ల విద్యార్థులు ఇంగ్లిష్ గ్రామర్ని సునాయాసంగా అర్థం చేసుకొంటున్నారు. పూర్వం ఇలా చెప్పాలంటే 45 నిమిషాల పిరీయడ్లో సాధ్యమయ్యేది కాదు.
– శ్యాంసుందర్రెడ్డి, ఇంగ్లిష్ టీచర్, జడ్పీహెచ్ఎస్, చల్వాయి (ములుగు)
గుర్తుండిపోతాయ్
జీర్ణ వ్యవస్థ చిత్రం పిల్లలకు చూపించిన తర్వాత, జీర్ణక్రియ ఎలా జరుగుతుందో వీడియో చూపిస్తాం. చూడటం వల్ల బాగా గుర్తు పెట్టుకొంటున్నారు. అలా జరుగుతుందని, ఇలా మారుతుందని మాట్లలో చెప్పిన దానికంటే వాటిని వీడియోలో చూపించడం వల్ల అందరికీ అర్థమవుతున్నది. కచ్చితంగా గుర్తు పెట్టుకొంటున్నారు. ఆ తర్వాత అవయవాల పేర్లను రెండుమూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలు. పాఠం చెప్తుంటే పిల్లలు సినిమా చూస్తున్నట్టు ఫీలవుతున్నారు. బోర్ అని ఫీల్ అవ్వట్లేదు.
– ఆకుల పద్మలత, హెచ్ఎం, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల (అభ్యుదయ పాఠశాల), పాల్వంచ (భద్రాద్రి కొత్తగూడెం)
ఐఐటీలా తరగతి గది..
మా ఐఐటీలో ప్రస్తుతం గ్రీన్ బోర్డుల మీదే పాఠాలు చెప్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రొజెక్టర్స్ వాడతారు. పాఠ్యాంశానికి సంబంధించిన ైస్లెడ్స్ చూపిస్తూ పాఠాలు చెప్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కాబట్టి ల్యాప్టాప్ వాడుకొనేందుకు పవర్, ఇంటర్నెట్ సదుపాయం ప్రతి విద్యార్థికీ కల్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్తో డిజిటల్ బోర్డు మీద పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఐఐటీ, ఐఐఎంలకు దీటుగా క్లాస్ రూమ్ని మార్చడం సంతోషంగా ఉన్నది. ఫలితాలు ఇంతకన్నా గొప్పగా రావాలని కోరుకుంటున్నా.
– సహజ వంగూరి, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి, ఐఐటీ, ముంబై