ఎల్లారెడ్డిపేట, నవంబర్ 23: ఓ మేకపోతు.. కాపరి పాలిట యముడైంది. పాలు పితికేందుకు వెళ్లిన కాపరి తలపై బలంగా పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు నెలరోజులపాటు చికిత్సపొంది మంగళవారం మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మేకల కాపరి చీకోటి చంద్రయ్య (46) గత నెల 25న తన మేకల వద్దకు పాలు పితికేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మందలోని ఓ మేకపోతు అకస్మాత్తుగా చంద్రయ్య తలపై పొడువాటి కొమ్ములతో బలంగా పొడిచింది. బలమైన గాయాలైన చంద్రయ్య.. స్థానిక ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకున్నా కోలుకోలేదు. పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు చికిత్స కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం కరీంనగర్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.