Harish Rao | ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని అన్నారు.
ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నదని హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమని అన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? అని నిలదీశారు.
ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన
మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా?
మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది.
ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ… pic.twitter.com/ViNggpOaPO
— Harish Rao Thanneeru (@BRSHarish) January 21, 2025
ఎన్నికల ముందు హామీలిస్తం.. అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ను హరీశ్రావు హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారిందని.. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఆరు గ్యారెంటీలు అమలు దగా.. రుణమాఫీ చేయడం దగా.. పంట బోనస్ ఇవ్వడం దగా.. రైతు భరోసా అమలు దగా.. రేషన్ కార్డుల జారీ దగా.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా అని హరీశ్రావు మండిపడ్డారు. ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తున్నారని ధ్వజమెత్తారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నదని.. అడుగడుగునా ప్రశ్నిస్తున్నదని అన్నారు. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు.. ఎంత మందిని అరెస్టులు చేస్తరని నిలదీశారు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండని హితవు పలికారు. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.