హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణకు కేంద్రం చేసింది, ఇచ్చింది ఏమీ లేదంటూ ధోకేబాజ్మోదీ (#DhokhebaazModi) హ్యాష్ట్యాగ్పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? తెలంగాణ నుంచి మీరు తీసుకుంటున్నది ఎంత? తిరిగి ఇస్తున్నది ఎంత? అని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన నెటిజన్లు కూడా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ధరల పెంపుపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. రోజంతా టాప్ ట్రెండింగ్లోనే కొనసాగింది.
తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ నిధులేవి?
తెలంగాణకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇవ్వకపోవటంపైనే ట్విట్టర్లో ఎక్కువగా చర్చ నడిచింది. ప్రకృతి విపత్తులు వస్తే ఇతర రాష్ర్టాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇస్తూ, తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వకపోవటంపై నెటిజన్లు ప్రధాని మోదీని నిలదీశారు. తమ ట్వీట్లకు ఇతర రాష్ర్టాలకు నిధులు జారీ చేసిన వివరాల జాబితాను కూడా జత చేశారు. ఇందులో 2018-19, 2019-20, 2020-21, 2021-22లో ఎన్డీఆర్ఎఫ్ నిధులరూపంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు ఇస్తే తెలంగాణకు ఒక్కసారి కూడా ఇవ్వలేదన్న వివరాలు ఉన్నాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు 2021-22లో ఒకేసారి రూ.1,000 కోట్లు ఇస్తే అదే సమయంలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్న విషయాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు.