సంగారెడ్డి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పేదలను దోచి పెద్దలకు పంచిపెడుతున్నదని ఆక్షేపించారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రూ.4 వేల కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే బహిరంగ సభ స్థలాన్ని హరీశ్రావు బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్, జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ముందుగా హరీశ్రావే రక్తదానం చేశారు. అనంతరం నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశంలో రైతుల కోసం ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన సందర్భంగా 21న నారాయణఖేడ్లో లక్ష మందితో సీఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహిస్తారని హరీశ్రావు తెలిపారు. సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులకు పిలుపునిచ్చారు. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ పథకాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ పూర్తిగా వివక్షకు గురైందని, 70 ఏండ్లలో పరిష్కారం కానీ సమస్యలకు కేసీఆర్ ఏడేండ్లలోనే పరిష్కారం చూపారని పేర్కొన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తపోతలను రెండేండ్లలోనే పూర్తిచేసి రైతులకు నీళ్లిస్తామని చెప్పారు. గుట్టలు, లోయలున్న నారాయణఖేడ్ నియోజకవర్గం గోదావరి జలాలతో పచ్చగా మారి కశ్మీర్, ఊటీలను తలపించటం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మదన్రెడ్డి, మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, నాయకులు దేవీప్రసాద్రావు, దేవేందర్రెడ్డి, జైపాల్రెడ్డి, లావణ్యరెడ్డి, ఉదయ్కిరణ్, భిక్షపతి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు మురళీయాదవ్, మల్లయ్య, మెదక్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.