LRS | నమస్తే నెట్ వర్క్, మార్చి 6: ఎల్ఆర్ఎస్పై ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో నగరాలు, పట్టణాలు దద్దరిల్లాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. రామగుండం నగరంతోపాటు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, చొప్పదండి పట్టణాలు, మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, జహీరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ పట్టణంలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్కుమార్, ఖానాపూర్లో నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్నాయక్, నిర్మల్ జిల్లా కేంద్రంలో, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, చెన్నూర్లో మున్సిపల్ చైర్మన్ అర్చన గిల్డా ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు కొనసాగాయి.
నినాదాల హోరు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. కొడంగల్, షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, దేవరకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పాల్వాయి స్రవంతి, సూర్యాపేటలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరిలో కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు కొనసాగాయి. ఆయా చోట్ల ర్యాలీల్లో నినాదాలు హోరెత్తాయి.