నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/నల్లబెల్లి/ఖానాపురం, జనవరి 9: దళితబంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని లబ్ధిదారులు నిరసన చేపట్టారు. మంగళవారం నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ప్ల్లకార్డులతో నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
అనంతరం ఆయా కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో దళితబంధు పథకంలో అర్హులను ఎంపిక చేసి, ప్రొసీడింగ్ కాపీలను కూడా అందించిందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరిచి చాలా రోజులు గడిచిందని, ఇప్పటివరకు ఖాతాలో ఆర్థికసాయం పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితబంధు పథకం రద్దు చేస్తే గ్రామాల్లో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడే ప్రమాదముందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి దళితబంధు పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.