జహీరాబాద్, ఫిబ్రవరి 29 : అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు(House sites) మంజూరు చేయాలని సంగారెడ్డి సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్ డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ పట్టణంలో (Zaeerabad) నిరుపేదలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళన(Dharna) నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు ఇండ్ల లేక అద్దె ఇండ్లలో ఉండి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వం పట్టణంలో నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వ భూములో ఇండ్ల స్థలాలు మంజూరు చేయా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ పట్టణ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.