నిజామాబాద్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు పసుపు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో ఎంపీ వైఫల్యాన్ని కొంతకాలంగా రైతులు నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్లినా అడ్డుకొంటున్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్కు వెళ్లాల్సి ఉన్నది. తమ ప్రాంతానికి ఎంపీ అర్వింద్ వస్తున్నారనే సమాచారం తెలుసుకొన్న రైతులు సాయంత్రం 4:30 గంటల నుంచే ఆర్మూర్-కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. ‘అర్వింద్ డౌన్ డౌన్.. బీజేపీ డౌన్డౌన్’ నినాదాలతో హోరెత్తించారు.
రైతుల నిరసన సమాచారం తెలుసుకొన్న అర్వింద్.. వారికి భయపడి కుకునూర్ పర్యటనకు వెళ్లకుండా తోక ముడిచారు. తన వైఫల్యాన్ని పోలీసులపైకి నెట్టేందుకు ప్రణాళిక రచించారు. బీజేపీ శ్రేణులతో కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు అధికార నివాసం ఎదుట బైఠాయించారు. పసుపుబోర్డు అంశాన్ని పక్కకు నెట్టేందుకు హిందూ, ముస్లిం అంటూ మీడియా ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, దళిత ఐపీఎస్ అధికారి సీపీ నాగరాజును నోటికొచ్చినట్టు ధూషించారు. రాత్రి 7:45 గంటలకు ఎంపీని అదనపు డీసీపీ నరేందర్రెడ్డి కలిసి రక్షణ కల్పిస్తామని చెప్పడంతో అర్వింద్ ఇంటికి వెళ్లిపోయారు.