ధర్మపురి, మార్చి 4: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర) కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు శాస్ర్తోక్తంగా శేషప్ప కళావేదికపై స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపారు. శ్రీలక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి శేషప్ప కళావేదికపై అధిష్ఠించారు.
స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ బాషా పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సాయంత్రం ఎంపీ వెంకటేశ్ నేతకాని, ధర్మపురి కమిషనర్ రమేశ్, మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ మకరంద్ పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. మతానికి అతీతంగా కలెక్టర్ యాస్మిన్ బాషా స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. నుదుట గంధం, కుంకుమతోపాటు తలపాగా ధరించి పాల్గొన్నారు. దీంతో పలువురు కలెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించారు.