హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): గతంలో వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా ఉండేది. విదేశాల్లో ఉండే ఎన్నారైల భూములకు భద్రత గాల్లో దీపం మాదిరిగా ఉండేది. భూములు అన్యాక్రాంతమయ్యేవి. రికార్డులు తారుమారయ్యేవి. వాటిని పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదా కబ్జా చేసిన వారికి ఎంతోకొంత ముట్టజెప్పి సెటిల్మెంట్ చేసుకొనేవారు. ఇలాంటి ఘటనలతో ఎన్నారైలు మానసికంగా ఒత్తిడికి గురయ్యేవారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక అగ్గువకే అమ్ముకొని వెళ్లిపోయిన సందర్భాలెన్నో. అలాంటివారికి ధరణి పోర్టల్ కొండంత అండగా నిలుస్తున్నది.
ప్రపంచంలో ఎకడున్నా వారి భూ రికార్డులను భద్రంగా ఉంచుతున్నది. ఒక్కసారి ధరణి పోర్టల్లో వివరాలు నమోదైతే ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదు. దీంతో ఎన్నారైల భూముల కబ్జాలకు చెక్ పడింది. ఎక్కడున్నా, ఏ క్షణమైనా తమ భూముల వివరాలను తెలుసుకొనేందుకు ధరణి పోర్టల్లో అవకాశం ఉండటంతో వారంతా గుండెలమీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు.
ఆధార్ లేకున్నా పాస్బుక్
ధరణిలో భూముల వివరాలు నమోదు కావాలంటే ఆధార్ ఉండాలి. ఎన్నారైలకు ఆధార్ లేకపోవడంతో సమస్య వచ్చింది. దీంతో ‘ఆధార్ లేకున్నా పాస్పోర్ట్ నంబర్ లేదా వారు నివసిస్తున్న దేశ పౌరసత్వ కార్డు ఆధారంగా పాస్బుక్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ధరణిలో ఎన్నారైల కోసం ప్రత్యేక మాడ్యూల్ను ప్రవేశపెట్టారు. పాస్బుక్ల కోసం దరఖాస్తు చేసేవారు తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఏ దేశంలో, ఎంతకాలంగా నివసిస్తున్నారు? పాస్పోర్ట్, వీసా నంబర్, బ్యాంకు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
అనంతరం పాత పాస్బుక్ లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, వారి ఫొటోలను అప్లోడ్ చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది. అధికారులు పరిశీలించి వారికి పాస్బుక్ మంజూరు చేస్తారు. ఒక్కసారి పాస్బుక్ మంజూరైతే ఆ భూములకు శాశ్వత రక్షణ లభించినట్టే. ఎన్నారైలు ఈ మాడ్యూల్ ద్వారా భూములను అమ్మడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎవరైనా తమ భూములను అమ్మాలనుకొంటే నమ్మకమైన వ్యక్తులకు ఆన్లైన్లోనే జీపీఏ చేసే అవకాశం కూడా కల్పించింది. పాస్బుక్ లేకుండానే నాలా కన్వర్షన్ చేసుకొనే ఆప్షన్ను తెచ్చింది. ఎన్నారైల నుంచి మొత్తంగా 1,575 దరఖాస్తులు రాగా, 1,396 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. దాదాపు 89 శాతం దరఖాస్తులకు పరిష్కారం లభించింది.
ఎన్నారై పోర్టల్ దరఖాస్తులు
వచ్చినవి: 1,575
పరిష్కరించినవి: 1,396