హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్పై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోసారి బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్మిట్టల్ ధరణి పోర్టల్పై కమిటీకి సమగ్ర నివేదిక అందజేశారు. పోర్టల్ నిర్మాణం, పనితీరు, ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు, వివిధ మాడ్యూల్స్ కింద వచ్చిన దరఖాస్తులు, వాటి స్థితి వంటి సమగ్ర వివరాలను నివేదించారు. వాటిని కమిటీ సభ్యులు అధ్యయనం చేసి మరుసటి భేటీలో చర్చించనున్నారు.
సమావేశం అనంతరం కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్కుమార్, సీఎంఆర్వో డైరెక్టర్ లచ్చిరెడ్డి సచివాలయం మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ.. గత సమావేశంలో ధరణి పోర్టల్, రాష్ట్రంలోని భూ సమస్యలకు సంబంధించిన సమాచారం అడిగామని, ఆయా వివరాలను అధికారులు మంగళవారం అందజేశారని చెప్పారు. మొదటి సమావేశంలో పరిచయాలు, ప్రాథమిక అంశాలకే కమిటీ పరిమితమైందని, బుధవారం నుంచే అసలు పని మొదలైందని చెప్పారు.
ధరణిని అర్థం చేసుకున్నామని, భూ సమస్యలపై చర్చించామని, రాబోయే సమావేశాల్లో పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు. ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. సోమవారం మూడోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. ధరణి అనేది లక్షల మంది రైతులకు సంబంధించిన అంశమని, అందుకే తాము తొందరపడటం లేదని స్పష్టంచేశారు. కొత్తగా పొరపాట్లు జరుగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పేర్కొన్నారు.