యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు (Dhanurmasam) వైభవంగా నిర్వహిస్తున్నారు. 30 రోజులపాటు జరుగనున్న ఈ వేడుకలను ఆదివారం వేకువజామున ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహచార్యులు, అర్చక బృందం ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు ఆలయ మొదటి ప్రాకార మండపంలోని ఉత్తరభాగం హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై నిర్వహించారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు.
యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండటంతో స్థానికులతో పాటు భక్తులు పాల్గొన్నారు. పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో మంగళ నీరాజనాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనవరి 15 వతేది వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని అర్చకులు తెలిపారు. 14న గోదాదేవి కల్యాణం, 15 న అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి ఉత్సవాలకు సమాప్తి వపలుకనున్నామని వివరించారు.
ఆదివారం కావడంతో యాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నది. కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో కూడా నేటి నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావైసేవ నిర్వహిస్తారు.
భద్రాచలం రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 వరకు రాములవారు రోజుకొక అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా నేడు వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. లక్షణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ నెల 22న గోదావరి నదిలో సీతారాములకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. దీంతో నేటి నుంచి 23 వరకు నిత్య కల్యాణాలను అధికారులు నిలిపివేశారు. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను అధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.