హైదరాబాద్ : గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొవిడ్ రికవరీ రేటు చాలా పెరిగిందని తెలిపారు. దాదాపు ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని, సాధారణ జీవనంలోకి వస్తున్నామన్నారు. పండుగల నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కరోనా సోకని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, పండుగలు.. విందులు.. షాపింగ్ సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యలను సంప్రదించాలన్నారు. డిసెంబర్ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని, ప్రజలంతా మాస్క్లు ధరించాలని సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.01కోట్ల మందికి కనీసం ఒక డోసు కొవిడ్ టీకా ఇచ్చామని, 38శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. రెండు డోసులు తీసుకుంటేనే కొవిడ్ పూర్తి రక్షణ లభిస్తుందన్నారు.