హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, నేరాల అదుపునకు కఠినంగా వ్యవహరించాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో కానిస్టేబుళ్ల శిక్షణను డీజీపీ రవిగుప్తా, ట్రైనింగ్ విభాగం ఏడీజీ అభిలాష బిష్త్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేసే ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు పోలీసుగా గర్వపడాలని తెలిపారు. పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న వారిలో సుమారు 200 మంది ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ క్యాడెట్లు ఉన్నారని, సైబర్ నేరాల నియంత్రణకు వారిని ఉపయోగించుకుంటామని చెప్పారు.
ట్రైనింగ్ విభాగం ఏడీజీ, టీఎస్పీఏ డైరెక్టర్ అభిలాష బిష్త్ మాట్లాడుతూ పోలీసు అకాడమీలో రిపోర్ట్ చేసిన 685 మందికి అన్ని అంశాల్లో 9 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐజీ రమేశ్రెడ్డి, టీఎస్పీఏ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ సీ అనసూయ, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సీ నర్మద, ఓఎస్డీ ఐ రాఘవరావు, కే శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 481 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణను ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ శివధర్రెడ్డి ప్రారంభించగా, పీటీసీ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. చంచల్గూడ జైలులో జైల్ వార్డర్ల శిక్షణ ప్రారంభోత్సవంలో జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జైళ్లశాఖ ఐజీలు వై రాజేశ్, ఎన్ మురళీబాబు, డీఐజీ డీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఆళ్లగడప వాసి, కానిస్టేబుల్ ధర్మపురి శ్రీకాంత్ కుటుంబానికి రూ.70 లక్షల ఇన్సూరెన్స్ చెకును తన కార్యాలయంలో డీజీపీ రవిగుప్తా గురువారం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గత డిసెంబర్లో శ్రీకాంత్ మరణించాడు. వేతన అకౌంట్ హెచ్డీఎఫ్సీలో ఉన్నందున బ్యాంకు అధికారులు ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెకు రూపంలో రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర, బ్యాంకు సరిల్ హెడ్ విశాల్ భాటియా, జోనల్ హెడ్ జోస్ స్టీఫెన్, రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.