హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై డీజీపీ రవి గుప్తా సమీక్షించారు. రైల్వేస్, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో రైల్వే పోలీస్, రైల్వే అధికారులతో సోమవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో.. రైల్వే పోలీస్కు అవసరమైన మరికొంత మంది సిబ్బందిని కేటాయించే విషయంపై చర్చిస్తానని డీజీపీ తెలిపారు.
రైల్వే ట్రాక్లపై జరుగుతున్న ప్రమాదాలపై విచారణ చేపట్టాలని రైల్వే పోలీసులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100, 139, 1512కు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే, సమీప రైల్వేస్టేషన్లలో, www.ceir.gov.in కు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.