హైదరాబాద్ : సరిహద్దు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం( Illegal liquor) రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ , రైల్వే, ట్రాన్స్పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar)సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం రవాణా నిరోధం పై ఆయన శనివారం డీజీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, గుడుంబాను నివారించామని వివరించారు. ప్రజలు ఇచ్చే సమాచారంతో అక్రమ మద్యం రవాణాదారులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వివిధ శాఖల మధ్య మరింత సమన్వయంతో అక్రమ రవాణాను పటిష్టంగా నివారించవచ్చని సూచించారు. రైల్వే పోలీస్I(Railway Police) కూడా పూర్తి సహకారం అందిస్తుందని రైల్వేస్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
2014 నుంచి రాష్ట్రంలో అక్రమమద్యం నివారణకు 27 ,883 మందిపై కేసులు నమోదు చేసినట్టు సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసే 161 మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రధానంగా ఢిల్లీ, చండీగఢ్,కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్ ల నుంచి అక్రమంగా రాష్ట్రానికి రవాణా అవుతోందని తెలిపారు. తరచుగా అక్రమాలకూ పాల్పడే 15 మందిపై పీడీ చట్టాన్ని(PD Act) కూడా పెట్టామని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ప్రొహిబిషన్ ఎక్సైజ్ కేసులు గణనీయంగా తగ్గాయని వివరించారు.
ప్రొహిబిషన్ ఎక్సయిజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ధరల్లో వ్యత్యాసం ఉండడం వల్ల గోవా, హర్యానా, చండీగఢ్ నుంచి అధికంగా అక్రమ మద్యం వస్తోందని పేర్కొన్నారు. కర్ణాటక(Karnataka), గోవా(Goa) రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు అక్రమంగా మద్యాన్ని తెస్తున్నారని, అంతర్రాష్ట బస్సులు, టూరిస్ట్ వాహనాల ద్వారా అక్రమ మద్యం వస్తోందని తెలిపారు. దీనితోపాటు, నాగ్ పూర్-బల్లార్షా, నిజామాబాద్ రైల్వే మార్గాల్లో కూడా అధికంగా వస్తోందని వివరించారు.