భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం పర్యటించారు. చర్ల మండలంలోని చెన్నాపురం బేస్ క్యాంపును డీజీపీ సందర్శించారు. సారపాక ఐటీసీ అతిథి గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో, ఇతర అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉందన్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పెంచాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు డీజీపీ పలు సూచనలు చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు ఏజెన్సీ ఏరియాల్లో పర్యటించొద్దు అని సూచించారు. రేపట్నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి.