హైదరాబాద్ : కరోనా పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. డీజీపీ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి మే 30వ తేదీ వరకు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 7.49 లక్షల కేసులు నమోదు అయ్యాయని కోర్టుకు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 35.81 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. బ్లాక్ మార్కెట్లో ఔషధాలను విక్రయించిన వారిపై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.