హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యకలాపాల్లో సాంకేతికతను వాడి ప్రజలకు పూర్తి స్థాయి భద్రతకు భరోసా ఇవ్వగలుగుతున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సాంకేతికత ఆధారంగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసుకొన్నామని చెప్పారు. సీసీసీ ప్రారంభోత్సవానంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడాలేదని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
సీఎం కేసీఆర్ విజన్తోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రభుత్వం ఈ సాంకేతికతను వాడటంతో మనకు మేలు చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించడమే సీసీసీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని వివరించారు. నేరస్థుల కంటే ఒక అడుగు ముందుండాలంటే పోలీసులు సాంకేతిక వాడకం పెంచాలని చెప్పారు. పోలీస్శాఖలోని ప్రతి ఒక్కరు సాంకేతికంగా సన్నద్ధులై ఉండాలని, ప్రతి పనిలోనూ బ్యాక్ఎండ్లో టెక్నాలజీ వాడకం పెరగాలని సూచించారు.
ఈ సెంటర్ పలు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధించడానికి సైతం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది అన్ని రకాల సాంకేతికతకు ఫ్యూజిన్ సెంటర్ వంటిదని, అన్ని ప్రభుత్వ విభాగాల డాటా బేస్లను ఒక్క చోటకు చేర్చే హబ్గా పనిచేస్తుందని వివరించారు. సీసీసీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్డాటా అనలైటిక్స్, వీడియో అనలైటిక్స్, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ హబ్ అని వెల్లడించారు. ఇంత మంచి టెక్నాలజీని రాష్ట్ర ప్రజలకు అందించినందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్శాఖ, ఇతర ప్రభుత్వశాఖల తరఫున ధన్యవాదాలు తెలిపారు.